Friday 6 November 2020

 కర్ణాటక శాస్త్రీయ సంగీత విశిష్టత: 4 


ఇప్పటివరకూ మనం కర్ణాటక సంగీతం లో తెలుగు భాష నిర్వహించిన పాత్రను తెలుసుకున్నాము.  ఇప్పుడు కర్ణాటక సంగీతం గొప్పదనం ఏమిటో తెలుసుకుందాం.

ప్రపంచం లో ఎన్నో సంగీత రీతులు ఉన్నాయి, పాశ్చాత్య దేశాలలో  ఇటాలియన్, స్పానిష్, అరబిక్, జపనీస్, చైనీస్ మొదలైనవి చాలా ఉన్నాయి. వాటికీ మన భారతీయ సంగీతానికి  ఉన్న ముఖ్యమైన తేడా ఒకటి ఉన్నది. పాశ్చాత్య సంగీతం హార్మొనీ ప్రధానమైనది...కొన్ని స్వరాలు  కలిసి ఒక కార్డ్  అవుతుంది. వాటి సహాయం తో మెజర్ కార్డ్ మైనర్ కార్డ్  అని కొన్ని   కార్డ్స్  కలయికతో   రాగాలు ఏర్పడుతాయి. పిచ్ లేక శృతి మారుతూ ఉంటుంది. ఈ పద్ధతిలో కేవలం 12 స్వరాలు మాత్రమె ఉంటాయి. రాగాలు చాలా తక్కువ.  ఒకసారి నోటేషణ్ రాస్తే దానిని కళాకారులు అనుసరించాల్సి వస్తుంది. స్వతంత్రంగా పాడే\వాయించే వీలు లేదు.


భారతీయ సంగీతం లో సప్త స్వరాలు, వాటి 16 రకాల  మేలవింపుతో  రాగాలు ఏర్పడతాయి. ఇవి మెలోడి ప్రధానమైనవి. స్వరాల కలయిక ఒక నిర్దుష్టమైన పద్ధతిలోనే  ఏర్పడుతాయి. ఇందులో శృతి మారదు. ఈ సంప్రదాయం లో మనోధర్మ సంగీతం అనే ప్రక్రియ ఉంటుంది. ఇందులో కళాకారుడు తన మేధస్సుతో, స్వతంత్రంగా అప్పటికప్పుడు రాగాలాపన, స్వరకల్పన,  సంగతులు వేయవచ్చు .


సప్త స్వరములు   7...వాటిలో   షడ్జమం,  పంచమం   లు   అచలములు   అనగా   ప్రక్రుతి స్వరములు. మిగతా   రి గ మ ద ని   లకు  మాత్రం   ప్రక్రుతి, వికృతి   బేధములతో    పది   స్వరములు   అవుతాయి .  ఈ పది   స్వరములను  స  ప   లతో   చేర్చి   ప్రస్తరించి  నట్లైతే    32   రాగములు   వచ్చును.   ఇట్టి విధానము   ప్రపంచము   లోని  అన్ని సంగీత పద్ధతులలోనూ   ఉన్నది.   ఇట్టి    32  మేళ  రాగముల   పట్టికలో   8 వ మేళకర్త   హనుమత్తోడి    మొదటి   రాగముగా   వచ్చును.


కానీ  ప్రాచీన కర్ణాటక   సంగీత   శాస్త్రజ్ఞులు   తమ   తపో,  మేధాశ్శక్తిని   ఉపయోగించి   12   స్వర స్థానములను  16   ప్రకృతి, వికృతి   స్వర స్తానములుగా    తాత్కాకాలికంగా    ఏర్పాటు చేసి,   వాటిని   ప్రస్తారించినచో  72   మేళకర్త   రాగములు   వచ్చును.    ఇన్ని   మేళకర్త   రాగములు   ప్రపంచం   లోని   ఏ   సంగీత  పద్ధతిలోనూ,   చివరకి   హిందుస్తానీ   సంగీతం  లోనూ   లేవు.


1869 లో రష్యన్ శాస్త్రజ్ఞుడు దిమిత్రి  మెండలీవ్...అప్పటివరకూ  ఉన్న 63 మూలకాలతో  ఒక పీరియాడిక్ టేబుల్  తయారు చేశాడు. డానికి ఈ నాట యాభై  ఏళ్లలో  55 కొత్త మూలకాలు చేర్చపడ్డాయి....ఇకముందు కూడా  కొత్త కొత్తవి  కనుక్కోవచ్చు.


17 వ శతాబ్దం కు చెందిన  వేంకటమఖి అనే విద్వాంసుడు 72  మేలకర్తల పథకం తన చతుర్దండి ప్రకాశిక అనే గ్రంధం లో ప్రకటించాడు. ఇప్పటి వరకు 3 శతాబ్దాలు గడిచాయి కానీ ఒక్క కొత్త మేలకర్తను ఎవరూ  కనుగొన లేకపోయారు....వచ్చే 30 శతాబ్దాల వరకూ  కూడా ఏ కొత్త మేళకర్తను  కనుగొనే అవకాశం లేదు.

అంత నిర్దుష్టంగా  తయారు చేశారు వెంకటమఖి  ఈ పథకాన్ని.


సామగాన  మేళ  స్వరాలకు   కొద్దిగా   దగ్గరగా  ఉండే   నేటి   మేళ కర్తలు...భైరవి,   ఖరహర ప్రియ.  ప ద ని స రి గ మ  లో   ప ద ని స   అనే స్వర సంపుటి   మధ్యమ స్థాయిలో   కూడా   వచ్చినప్పుడు  ...నేటి   సప్త స్వరములు   స రి  గ  మ  ప  ద  ని     గా   మారినవి.  ఇది సంపూర్ణ మేళం  ( heptatonic   స్కేల్ ).  ఈ పరిణామం   భారతీయ సంగీత చరిత్రలో   గొప్ప మలుపు.   ఆ   తరువాత   షడ్జ,  గాంధార, మధ్యమ  గ్రామాలు,   ద్వాదశ,   షోడశ,  ద్వావింశతి   స్వర స్థానాలు,   72  మేళ కర్తలు ,  అసంఖ్యాక మైన  వాటి   జన్య రాగాలతో   నేటి కర్ణాటక   సంగీతం   సుసంపన్న మైంది .   ప్రపంచ   సంగీతం   లో   అగ్రగామిగా   నిలబడింది.


వచ్చే  పోస్టులో  విదేశీయులు  భారత దేశానికి రాకముందు సంగీతం ఎలా ఉంది.  ప్రపంచం లోని ప్రాచీన సంగీత రీతులు  విదేశీయుల దండయాత్రల వాళ్ళ ఎలా  కనుమరుగయ్యాయో  చూద్దాం.

No comments:

Post a Comment